by Suryaa Desk | Sat, Sep 14, 2024, 07:10 PM
తెలంగాణ రాష్ట్రం సాకారమైందంటే.. అది ఎంతో మంది అమరవీరుల త్యాగఫలమే. వారు ఆ రోజున చేసిన త్యాగమే.. నేడు స్వరాష్ట్రంలో అనుభవిస్తున్న స్వేచ్ఛ. కానీ.. సాధించుకున్న తెలంగాణలో కూడా ఆంధ్రా అధికారులు పెత్తనం చెలాయిస్తుండటం శోచనీయం. అందులోనూ.. ఉద్యమం కీలక మలుపు తీసుకునేలా చేసిన ఓ అమరవీరుని భార్యకు ఓ ఆంధ్రా అధికారిణి నుంచి వేధింపులు వస్తుండటం బాధాకరం. అది కూడా ఎవరికో కాదు.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతికి.. ఓ ఆంధ్రా అధికారిణి వేధిస్తున్నట్టు తెలుస్తోంది. తన జీవితంలో ఎదగనీయకుండా.. అడ్డుపడుతున్నట్టుగా మాచారం.
కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగానికి ఫలితంగా.. అప్పటి ప్రభుత్వం ఆయన భార్య పద్మావతికి ఇంటర్ విద్యా శాఖలో ఉద్యోగం కల్పించింది. ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే పద్మావతి.. లైబ్రరీయన్గా ఎదిగేందుకు.. కష్టపడి చదివి దానికి సంబంధించిన అర్హతను సాధించారు. ఆ తరువాత జూనియర్ కళాశాలలో లైబ్రరీయన్గా సేవలు అందించేందుకు.. అందరితో పాటే దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఇంటర్మీడియట్ విద్యలో మల్టీజోన్-1లో 60 ఖాళీలు ఉండగా.. దురదృష్టవశాత్తు పద్మావతి నెంబర్ 61. అయినప్పటికీ.. ఆమె పేరును డిపార్ట్మెంట్ కమిటీ అప్రూవ్ చేసింది. అర్హత సాధించిన 60 మందిలో ఏ ఒక్కరు విధుల్లో చేరకపోయిన పద్మావతికి ప్రమోషన్ ఇవ్వాల్సింది కమిటీ నిర్ణయించింది.
అయితే.. ఆ 60 మందిలో ఏకంగా ముగ్గురు.. తమ వ్యక్తిగత కారణాల చేత ప్రమోషన్ వద్దని రాతపూర్వకంగా కమిటీకి విన్నవించుకున్నారు. ఈ లెక్కన.. పద్మావతికి సులభంగా ప్రమోషన్ దొరకాల్సింది. కానీ.. ఇప్పటికి కూడా ఆమెకు ప్రమోషన్ రాకపోవటం గమనార్హం. ఇదే విషయాన్ని.. ఇంటర్ విద్యాశాఖలోని ముఖ్యమైన ఇద్దరు అధికారులతో పాటు కమిషనర్ శృతి ఓజాకు అనేకసార్లు మొరపెట్టుకున్నారు.
అయితే.. ఈ మొత్తం వ్యవహారాన్ని తన గుప్పిట్లో పెట్టున్న ఒక ఆంధ్రా అధికారిణే.. కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతికి ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. పద్మావతిని 100 సార్లు కార్యాలయం చుట్టూ తిప్పించుకొని.. ప్యానెల్ ఇయర్ పూర్తయ్యింది కాబట్టి నీకు ప్రమోషన్ ఇచ్చేదే లేదు.. నీ దిక్కున్న చోట చెప్పుకుపో అని.. పద్మావతిని ఇంటర్మీడియట్ కార్యాలయం నుంచి గెంటివేయటం ఆ ఆంధ్రా అధికారిణి అహంకారానికి నిదర్శనం.
ఇలాంటి దయనీయ ఘటన తర్వాత.. ఈరోజు (సెప్టెంబర్ 14న) ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశంను పద్మావతి కలిశారు. ఆయనతో.. తన బాధ, గోడుతో పాటు ఆ ఆంధ్రా అధికారిణి చేసిన అవమానాలను విన్నవించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.