by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:24 PM
ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నిరోజుల వరకు అంతా బాగానే నడించింది. కానీ.. మధ్యలో ఏం జరిగిందో తెలియదు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త పెరగటంతో.. భర్తను వదిలి భార్య వెళ్లిపోయింది. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనను వదిలివెళ్లిపోవటంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ భర్త.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఓ హాస్టల్లో ఉంటుండగా.. ఆమె ఉంటున్న గది కిటికీలో నుంచి చూస్తే కనిపించేలా.. ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ సెంటర్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే.. తన భార్య తనను విడిచి వెళ్లిపోయిందని.. కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన రహీం బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. విచారణ చేపట్టారు. విచారణలో.. రహీంది ప్రేమ వివాహం అని తెలిసింది.
అయితే.. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత.. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని.. అవి భరించలేకనే భార్య రహీం నుంచి దూరంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా.. రహీంది శ్రీశైలమని పోలీసులు తెలిపారు. శ్రీశైలంలో ఆటో డ్రైవర్గా పని చేసేవాడని.. అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ 498 కేసు కూడా నడుస్తోందని పోలీసులు వివరించారు.
అయితే.. రహీం భార్య అరవిందు ఫార్మసీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇద్దిరి మధ్య తలెత్తిన గొడవలతో ఆమె.. ఓ ప్రవేట్ హాస్టల్లో ఉంటుందని సమాచారం. భార్య తన దగ్గరికి రావటంలేదని తీవ్ర మనస్తాపం చెందిన రహీం.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది కూడా.. తన భార్యకు కనబడేలా.. ఆమె ఉంటున్న హాస్టల్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. రహీం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మిగతా విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.