by Suryaa Desk | Mon, Sep 09, 2024, 07:14 PM
సీఎం రేవంత్ రెడ్డి మరో తీపికబురు వినిపించారు. ఈసారి మహిళలకు ఎగిరిగంతేసి శుభవార్త చెప్పారు రేవంత్ రెడ్డి. హైదారాబాద్ నాంపల్లిలో ఐఐహెచ్టీ వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం.. చేనేతకు సినీ తళుకు బెళుకులు తెచ్చారని.. అయినా నేతన్నల రాత మారలేదని చెప్పుకొచ్చారు. బతుకమ్మ చీరల పేరుతో సిరిసిల్ల కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిందని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. ఆ మొత్తాన్ని తాము అధికారంలోకి వచ్చాక విడుదల చేశామని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలోనే చేనేత కార్మికులను ఆదుకునేందుకు కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ బతుకమ్మ చీరల పంపిణీ ఆపేస్తే.. పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ కార్మికులు నష్టపోతారని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. అయితే.. గత ప్రభుత్వంలో ఆడపడుచులకు అందజేసిన బతుకమ్మ చీరలు కట్టుకునేంత నాణ్యత గానీ.. పెట్టాల్సినంత పెట్టుబడిగానీ పెట్టలేదని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ క్రమంలోనే.. తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
స్వయం సహాయక సంఘాల కింద సుమారు 63 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు మంచి డిజైన్తో, సంవత్సరానికి ఒక్కొక్క ఆడపడుచుకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. ఈ పద్ధతిలో కోటీ 30 లక్షల చీరలను చేనేతలకు ఆర్డర్ ఇవ్వొచ్చని రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ మేరకు మంచి క్వాలిటీతో పాటు మంచి డిజైన్లతో రావాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వంపై మహిళా లోకం చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే.. స్వయం సహాయక సంఘాల మహిళలకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు.. చేనేత కార్మికులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. చేనేత కార్మికులకు ఒక్క అన్నగా అండగా ఉంటానని తెలిపిన రేవంత్ రెడ్డి.. రైతులకు చేసినట్టుగానే నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వెంటనే అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. చేనేతకు చేయూత పథకం కింద రూ.290 కోట్లు సహా నేతన్నల కోసం పెండింగ్ బిల్లులు కలిపి మొత్తంగా రూ. 335 కోట్ల విడుదల చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.