by Suryaa Desk | Sat, Sep 14, 2024, 09:35 PM
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందన్నారు. అయితే అది ఏపీ తీరంలో కాదు. బంగ్లాదేశ్కి ఆగ్నేయ దిశలో అది కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. ఈ వాయుగుండం వాయవ్య దిశగా కదులుతోందని.. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీని కారణంగానే ఏపీ, తెలంగాణల్లో ఈ వారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో కురుసే ఛాన్స్ ఉందన్నారు.
ఇవాళ తెలంగాణంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని.. భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదన్నారు. ఇక గాలుల వేగం చూసుకున్నట్లయితే అరేబియా సముద్రంలో గంటకు 25 కిలోమీటర్లుగా ఉందన్నారు. బంగాళాఖాతంలో గంటకు 35 కిలోమీటర్లుగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్లుగా గాలి వేగం ఉందని అన్నారు. గాలి వేగం తక్కువగా ఉంది కాబట్టి కొంత ఉక్కపోతగా ఉండొచ్చునని అన్నారు. నేడు తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని చెప్పారు. తేమ 45 శాతంగా ఉంటుందని.. అందువల్ల వేడి, ఉక్కపోత ఉండే ఛాన్స్ ఉందన్నారు. భారీ వర్షాలకు అవకాశం లేదు కాబట్టి ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చునని అన్నారు.
వరద నష్టం రూ.10 వేల కోట్లుఇటీవల తెలంగాణకు భారీ వర్షాలు, వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల పరిధిలో వరదల వల్ల అపార నష్టం వాటిల్లింది. అన్ని రకాలుగా కలిపి మెుత్తం నష్టం విలువ రూ.10,320.72 కోట్ల వరకు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సమర్పించింది. రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటల తెగిపోవటంతో అపార నష్టం వాటిల్లినట్లు నివేదికలో వెల్లడించారు.