by Suryaa Desk | Tue, Sep 10, 2024, 02:19 PM
తెలంగాణలో బీసీ కులగణన త్వరగా జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ.హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈరోజు ఆ పిటిషన్ పై ధర్మసం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు వాదనలు వినిపించారు నాగుల శ్రీనివాస్ యాదవ్. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల్లో బీసీ కుల గణన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని కోరింది.తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదే దానిపై చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే సర్పంచుల పదవి కాలం ముగిసిన ఇంకా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ప్రభుత్వం ప్రకటించలేదు. కాగా కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు కీలక నేతలు ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే, స్థానిక సంస్థలు ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి వస్తోంది. అయితే, దసరా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైకోర్టు కూడా బీసీ కులగణనపై ఆదేశాలు ఇవ్వడంతో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సీనియర్ నేత నిరంజన్ చైర్మన్ గా నలుగురు సభ్యులతో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కులగణన చేపడతామని బాధ్యతల స్వీకరణ సమయంలో చైర్మన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం సైతం బీసీ కులగణనకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. స్థానిక ఎన్నికల తర్వాతనా? లేక ఇప్పుడా? అన్న విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుత హైకోర్టు తీర్పు నేపథ్యంలో కులగణన తర్వాతనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.