by Suryaa Desk | Mon, Sep 09, 2024, 08:58 PM
హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటానికి రీజినల్ రింగు రోడ్డు (RRR) నిర్మించతల పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 40. కి.మీ దూరం నుంచి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇది సూపర్ గేమ్ ఛేంజర్ అని.. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలో ప్రస్తుతం కసర్తతు జరుగుతోంది.
ఉత్తర భాగాన్ని సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగ్దేవ్పూర్- భువనగిరి- చౌటుప్పల్ మీదుగా నిర్మించనున్నారు. అయితే ఉత్తర భాగాన్ని తొలుత 158.64 కి.మీ ఉండగా.. కొన్ని రోజుల క్రితం 2.95 కి.మీ పెంచి 161.59 కి.మీ.కు సవరించారు. ఇక చౌటుప్పల్- ఆమన్గల్- షాద్నగర్- చేవెళ్ల- సంగారెడ్డి మీదుగా నిర్మించనున్న దక్షిణ భాగాన్ని మెుదట 181.87 కి.మీగా నిర్ణయించగా.. ఇటీవల 189.20 కి.మీ.కు పెంచారు. అయితే ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని 189.20 నుంచి 194 కిలోమీటర్లకు పెంచినట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం.
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. ఇటీవల వరుసగా సమీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా అలైన్మెంట్లో కీలక మార్పులు చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కలుపుతూ ప్రస్తుత అలైన్మెంట్ రూపొందించినట్లు తెలిసింది. వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలను కొత్తగా కలపడం వల్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం విస్తీర్ణం 5 కి.మీ పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర భాగం భూ సేకరణ జరగుతుండగా.. రహదారి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. దక్షిణ భాగం అలైన్మెంట్ అనంతరం ఈ భాగానికి కూడా జాతీయ రహదారి నెంబర్ కేటాయించటంతో పాటుగా ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.
ఇక రీజినల్ రింగు రోడ్డు విస్తీర్ణం 5 కి.మీ పెంచటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీఎం రేవంత్ తన స్వార్థం కోసమే పరిధిని పెంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం సొంత జిల్లా వికారాబాద్ని టచ్ చేయడానికి 5 కిలోమీటర్లు పెంచారని.. అందరు సీఎంలు స్వార్థపరులేనని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.