by Suryaa Desk | Mon, Sep 09, 2024, 08:55 PM
తెలంగాణలోని జర్నలిస్టులకు సీఎం రేవంత్ తీపి కబురు చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే చూస్తుందని అన్నారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కారించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ వెనుకడుగు వేయలేదన్నారు. నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు.
ఆదివారం రవీంద్రభారతిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్) హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు పేట్బషీరాబాద్లోని 38 ఎకరాల భూమికి సబంధించిన అప్పగింత పత్రం (మెమో)ను సీఎం అందజేశారు. అలాగే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ప్రజాభిప్రాయం, పాత్రికేయుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని అన్నారు. ఒకప్పుడు రాజాకీయ పార్టీలు తమ సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి, కానీ ఇప్పుడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని.. అది మనకు మనమే పెంచుకోవాలన్నారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు అనే పదానికి అర్ధాన్నే మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉన్మాదంతో వ్యవహరించే అలాంటి వారిని నియంత్రించే బాధ్యత కూడా జర్నలిస్టులపైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. జర్నలిజం ముసుగులో కొందరు రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని చెప్పారు.
జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇండ్ల స్థలాల విషయంలో మిగతా జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ప్రజా ప్రభుత్వానికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు.