ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి ఈడీ, అతడి స్టేట్‌మెంట్ ఆధారంగానే..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 08:10 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లో వెళ్లేకొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాదు.. టాస్క్‌ఫోర్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజుర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరిలించినట్లు కేసులో నిందితుడుగా ఉన్న మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు పోలీసు కస్టడీలో ఒప్పుకున్నాడు. ఈ మేరకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.


డబ్బులతో ముడిపడిన అంశం కావటంతో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నజర్ పెట్టింది. రాధా కిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా రంగలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో డబ్బు తరలింపుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఒక చోట నుంచి ఇంకో చోటుకి డబ్బులు తరలింపు వెనుక ప్రధాన పాత్ర ఎవరిదనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి లేటెస్ట్ మెటీరియల్ కొనుగోలు చేయగా.. అందుకు డబ్బులు ఎవరు సమకూర్చారనే దానిపై కూడా నజర్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఎంత డబ్బు అప్పటి అధికార పార్టీకి చేర్చారు ? సీజ్ చేసిన ప్రతిపక్ష నాయకుల డబ్బు ఎవరి చేతికి చేరాయనేది తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ఇదిలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తులో అధికారులు వేగం పెంచారు. మంగళవారం అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ ముగియడంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. నేడు రాధా కిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. రాధా కిషన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐబీలో ఓస్డీగా పనిచేసిన వేణుగోపాల్ రావుకు కూడా నోటీసులు జారీ చేయగా.. ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన్ను విచారిస్తున్నారు. వేణుగోపాలరావు రిటైర్డ్ కాగానే గత ప్రభుత్వం ఆయన్ను ఎస్ఐబీ OSDగా నియమించింది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీంలో ఆయన కీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించి ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్నట్లు తేలితే అరెస్టు చేసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa