భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 17న రాములోరి కల్యాణం జరగనుంది. ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున ఇప్పిటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రామయ్య కల్యాణోత్స వేడుకలు చూసేందుకు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఓ స్పెషల్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది.
డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ మీదుగా భద్రాచలం రోడ్-విజయవాడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు మూడోలైను పనులు, ట్రాక్ మరమ్మతుల కారణంగా కొన్ని నెలల క్రితం రద్దు అయిన విషయం తెలిసిందే. భద్రాచలం రోడ్ వైపు వెళ్లేందుకు, అటు వైపు నుంచి డోర్నకల్ రావడానికి మధ్యాహ్నం ట్రైన్ సదుపాయం లేక ఈ ప్రాంత ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. భద్రాచలం రోడ్-విజయవాడ వయా డోర్నకల్ ప్యాసింజర్ ట్రైన్ నడపాలని గతంలో రైల్వే ఉన్నతాధికారులకు వివిధ వర్గాల ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందించారు.
ఎట్టకేలకు ఈ ట్రైన్ నడపడానికి దక్షిణ మధ్య రైల్వే సంసిద్ధత వ్యక్తం చేసి శనివారం నుంచి రాకపోకలు మొదలెట్టింది. విజయవాడ వైపు నుంచి నెంబర్ 07979 రైలు డోర్నకల్కు ఉదయం 11.19 గంటలకు చేరుకుని 11.20 గంటలకు భద్రాచలం రోడ్ వైపునకు వెళుతుంది. తిరుగు ప్రయాణంలో భద్రాచలం రోడ్ నుంచి నెంబర్ 07278 ట్రైన్ డోర్నకల్కు సాయంత్రం 03.20 గంటలకు చేరుకుని 03.25 గంటలకు విజయవాడ వైపు వెళుతుంది. రైలు పునఃప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. డోర్నకల్లో పాటు పరిసర ప్రాంత ప్రజలకే కాదు ఏపీ నుంచి రాములోరి కల్యాణానికి వచ్చే భక్తజనానికి ఈ ట్రైన్ అనువుగా ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa