ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర, అమల్లో ఉండే ఆంక్షలివే..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 07:31 PM

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశాయి. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు అగ్రనేతలు కూడా క్షేత్రస్థాయిలో దిగి ప్రచారం చేశారు. ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. ఒక్కసారిగా తెలంగాణ అంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. ఇక హైదరాబాద్‌లో స్థిరపడిన ఓటర్లంతా ఓట్ల పండుగ కోసం ఊర్లకు తరలివెళ్తున్నారు.


ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో లోక్ సభ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. మే 13 సోమవారం రోజున జరుగనున్న పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అటు రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉండటంతో.. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మరిన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు.


ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..


★ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.


★ ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.


★ ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.


★ పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.


★ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.


★ మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.


★ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa