తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి 25 రోజుల పాటు సాగిన ప్రచారపర్వానికి ఫలితంగా.. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈరోజు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేశారు. అయితే.. దేశంలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడుతలో తెలంగాణలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించగా.. కొన్ని చెదురు ముదురు ఘటనలు తప్ప అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బూతులకు క్యూ కట్టారు. ఎండ కారణంగా.. ఉదయం పూట ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మధ్యాహ్నం సమయంలో కొంత సన్నగిల్లింది. కాగా.. పోలింగ్ ముగిసే చివరి గంటల్లో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. దీంతో.. పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు.
సాధారణంగా అయితే.. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా.. చివరి సమయంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్లలో బారులు తీరటంతో.. పోలింగ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటేసే అవకాశం ఇచ్చినట్టు ఈసీ అధికారులు తెలిపారు. ఎంత రాత్రి అయినా.. అందరు ఓటేసే వారకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా.. మిగతా అన్ని స్థానాల్లో ఆరు గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. గతంలోనూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే 6 గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశాన్ని అధికారులు కల్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 40. 38 శాతం పోలింగ్ నమోదు కాగా.. 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక.. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనుండటంతో.. ఈ ఓటింగ్ శాతం పెరగనుంది. అయితే చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు లైన్లలో బారులు తీరటంతో.. ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి పోలింగ్ శాతంపై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటివరకు ఉన్న సమచారం మేరకు భువనగిరి స్థానంలో అత్యధిక పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా ఓటింగ్ నమోదై ఎప్పటిలాగే హైదరాబాద్ చివరిలో ఉంది.
పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా పోలింగ్ శాతం (6 గంటల వరకు)..
ఆదిలాబాద్- 69.81
పెద్దపల్లి- 63.86
కరీంనగర్- 67.67
నిజాామాబాద్- 67.96
జహీరాబాద్- 71.91
మెదక్- 71.33
మల్కాజ్ గిరి- 46.27
సికింద్రాబాద్- 42.48
హైదరాబాద్- 39.17
చేవెళ్ల- 53.15
మహబూబ్నగర్- 68.40
నాగర్ కర్నూల్- 66.53
నల్గొండ- 70.36
భువనగిరి- 72.34
వరంగల్- 64.08
మహబూబాబాద్- 68.60
ఖమ్మం- 70.76
రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందుల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగియగా.. లైన్లలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa