ప్రముఖ ఇంటర్నేషనల్ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా.. తెలంగాణలో తన సంస్థను విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కోకా కోలా కంపెనీ ప్లాంట్ ఉండగా.. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. విస్తరణలో భాగంగా పెద్దపల్లిలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం (జూన్ 8వ తేదీన) కోకా కోలా గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.
పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించాలని కంపెనీని మంత్రులు ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన జోనథన్.. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్ఫీల్డ్ ప్లాంట్తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ప్లాంట్ని సంస్థ పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ ఆర్మ్ అయిన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ స్థాపించనుంది. ఇది ఇప్పటికే ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రదేశాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఆ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa