పెరుగుతున్న ధరలతో సామాన్యులు కుదేలవుతున్నారు. ఇప్పటికే కూరగాయల ధరలు, నిత్యవసరాల రేట్లు భారీగా పెరిగి సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక టమాటా ధర అయితే ఇప్పటికే భారీగా పెరిగింది.ఒపెన్ మార్కెట్లో కిలో టమాటా ధర 60-70 రూపాయలు పలుకుతుంది. ఇది అనే కాదు.. కూరగాయల ధరలన్ని పైపైకి ఎగబాగుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యుల నెత్తిన బాంబు వేయడానికి ఉల్లిపాయ కూడా రెడీ అవుతోంది. మార్కెట్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. ఆ వివరాలు..కూరగాయలు కొనాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు. ఇప్పటికే టమాటా, ఇతర కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇక నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఉల్లి ధర.. చూస్తుండగానే పైపైకి చేరుతుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర రూ.40-రూ.45 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ దేశ వ్యాప్తంగా ఫేమస్. ఈ మార్కెట్కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మద్నగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్నుల వరకు ఉల్లి దిగుమతులు అవుతుంటాయి. కానీ ఈసారి అవి భారీగా తగ్గిపోయాయి. దాంతో ఉల్లి రేటు పెరిగింది.
తాడేపల్లిగూడెం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు మార్కెట్లకు సైతం ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ఈ మార్కెట్కు ప్రస్తుతం రోజుకు 240 టన్నుల ఉల్లి మాత్రమే వస్తోంది. గతంలో ఇది 450 టన్నులుగా ఉండేది. ఫలితంగా గత వారం రోజులుగా ఉల్లి ధరల్లో మార్పులు వచ్చాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ రూ.20 నుంచి రూ.30 వరకు పలికిన కేజీ ఉల్లి.. ఇప్పుడు రూ.50-రూ.60కి చేరింది. వారం క్రితం వరకు రూ.100కు మూడు కిలోల ఉల్లి విక్రయిస్తుండగా.. ప్రస్తుతం దుకాణాల వద్ద నాణ్యతను కిలో రూ.40 నుంచి రూ.45 వరకు అమ్ముతున్నారు. డిమాండ్, సరఫరా మధ్య అంతరం ఏర్పడటం వల్ల ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మరోవైపు కూరగాయల ధరలు సైతం భారీగా పెరిగాయి. వేసవి ఎండల తీవ్రత వల్ల కూరగాయల సాగుకు తీవ్ర నష్టం కలిగింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత మాడిపోయి దిగుబడులు పడిపోవడంతో, కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు కిలో వంకాయలు 20 ఉండగా.. ఇప్పుడు రెట్టింపు అనగా.. రూ.40కి చేరగా, బెండకాయలు రూ.24 నుంచి రూ.40కి చేరాయి. బీరకాయలు రూ.30 నుంచి రూ.50కి పెరిగాయి. మరోవైపు పప్పు, ఉప్పు వంటి నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకాయి. పెరిగిన ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa