ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్నింగ్ బస్సు దిగిన అమ్మాయి.. చూస్తుండగానే విషాదం, ఈమధ్యే ఇంటర్‌లో చేరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 07:39 PM

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ బస్ చక్రం కింద నలిగి ఓ విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఓ మలుపు వద్ద రన్నింగ్ బస్సు నుంచి విద్యార్థిని అకస్మాత్తుగా కిందకు దిగింది. అయితే, ఎదురు దిశలో దిగడంతో తూలిపోయి కిందపడింది. ఈలోపే బస్సు వెనుక చక్రం అమ్మాయి తల మీద నుంచి వెళ్లిపోయింది. అందరూ చూస్తుండగా ఘోరం జరిగిపోయింది. విద్యార్థిని తల నుజ్జునుజ్జై అక్కడిక్కడే మృతి చెందింది. ఆ విషాద దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది.


 విద్యార్థిని మెహ్రీన్.. ఇటీవలే యూసఫ్‌గూడలోని మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరింది. శుక్రవారం (జూన్ 14) మధ్యాహ్నం కాలేజీకి వెళ్లిన మెహరీన్.. మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చే క్రమంలో ఈ ప్రమాదానికి గురైంది.


మెహ్రీన్ స్నేహితురాలైన మరో అమ్మాయి అంతకుముందే వెనుక డోర్ నుంచి రన్నింగ్ బస్సు నుంచి దిగినట్లు తెలుస్తోంది. దీంతో మెహ్రీన్ కూడా బస్సు దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కిందపడిపోయింది. బస్సు కిక్కిరిసిపోయి ఉండటం, ఫుట్‌బోర్డులో విద్యార్థులు ఉండటంతో డ్రైవర్ గమనించలేదు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.


తమ కుమార్తె మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు వచ్చేసరికే స్థానికులు మృతదేహంపై వస్త్రం కప్పి ఉంచారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫుట్‌బోర్డు ప్రయాణం ఎంత ప్రమాదకరమో, రన్నింగ్ బస్సు దిగడం ఎంద డేంజరో ఈ ఘటన తెలియజేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa