దేవభూమిగా పేరు గాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాలయ రాష్ట్రంలో పడుతున్న వర్షాలకు అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక కొండలపై భారీగా వానలు పడుతుండటంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రహదారులు మూసుకుపోతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ఉత్తరాఖండ్ అధికారులు.. అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర, అమర్నాథ్ యాత్రలు కొనసాగుతుండగా.. భారీ వర్షాలు యాత్రికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోతున్నారు. తెలంగాణ నుంచి కూడా చాలా మంది చార్ధామ్, అమర్నాథ్ యాత్రలకు వెళ్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే చార్ధామ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు హైదరాబాద్ నగర వాసులు ఉత్తరాఖండ్లో ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో ఆ ఇద్దరు హైదరాబాదీలు దుర్మరణం చెందారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) ప్రాణాలు కోల్పోయారు. కర్ణప్రయాగ, గౌచర్ ప్రాంతాల మధ్య.. బద్రీనాథ్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ ప్రమాదంలో వారిద్దరూ మృతి చెందారు.
వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి.. బైక్పై తిరిగి వస్తుండగా.. భారీ వర్షానికి మార్గమధ్యంలో కొండచరియలు విరిగి వారి బైక్పై పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో నిర్మల్ షాహీ, సత్యనారాయణ శిథిలాల కింద చిక్కుకుని చనిపోయినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్ట్మార్టం కోసం.. సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఇక వారి వివరాలు సేకరించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. నదులు అన్నీ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బద్రీనాథ్ నేషనల్ హైవేపై కొండచరియలు కూడా విరిగిపడుతుండటంతో.. వివిధ ప్రాంతాల్లో రోడ్డుపై శిథియాలు పడి ధ్వంసమైంది. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్-కేదార్నాథ్ జాతీయ రహదారిపై కూడా కొండ చరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక శనివారం , ఆదివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రుద్రప్రయాగ్లో అన్ని స్కూళ్లకు శనివారం సెలవు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరం అయితే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa