ఉట్నూర్, ఆగష్టు 19: భారత ఉన్నత న్యాయస్థానం ఎస్సీలను వర్గీకరించాలని తీర్పు చెప్పడాన్ని నిరసిస్తూ మాల మహానాడు జాతీయ కమిటీ ఇచ్చిన ఫిలిప్ మేరకు బుధవారం భారత్ బంద్ నిర్వహించాలని మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి దాసండ్ల ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు నేరుగా ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుపై ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా ధర్నాలు సైతం చేయడం జరిగిందని, మాలలు, మాల ఉపకులాల ఆధ్వర్యంలో సుప్రీం తీర్పు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రం చేయనున్నామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 341 ఆర్టికల్ విధి విధానాలు పాటించకుండా ముందుకు వెళ్లడం సరైనది కాదన్నారు.
ఒక కులాన్ని తీయాలన్నా, చేర్చాలన్న పార్లమెంట్లో చర్చించి రాష్ట్రపతికి బిల్లు పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఇలలో కూడా తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపించాల్సి ఉంటుందని అన్నారు. ప్రధానమంత్రి కనుసన్నలలో ఉన్నత న్యాయస్థానం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని ఇది దారుణమైన చర్య అన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మాల మహానాడు ఆధ్వర్యంలో తగిన శాస్తి చేస్తామన్నారు. తాము ఇస్తున్న బంద్ పిలుపుకు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సహకరించి బంద్ పాటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరంతర ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో కాటం రమేష్, గొల్లపల్లి నరసయ్య, తౌటి ఆశన్న,దూట రాజేశ్వర్, బొంకంటి సుభాష్ ,సతీష్, దూట మహేందర్,కోడి ప్రభాకర్ రావు,వినోద్, ఎర్రదండి సుశీల్, అచ్చనందం, రాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa