ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటర్‌ ట్యాంకుపై గణపయ్య,,,గత 20 ఏళ్లుగా అక్కడే ప్రతిష్ఠాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 09:08 PM

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు భక్తుల నుంచి పూజలనందుకుంటున్నాడు. వాడవాడలో ఎక్కడ చూసినా వినాయక మండపాలే కనిపిస్తున్నాయి. గణపతి భారీ విగ్రహాలతో పాటు, పలు వెరైటీ గణపతి విగ్రహాలు కనువిందు చేస్తు్న్నాయి. కొన్ని చోట్ల వెరైటీ విగ్రహాలు కనిపిస్తే.. మరికొన్ని చోట్ల వినూత్నంగా మండపాలు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన మండపాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.


తాజాగా.. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం సోషలో మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వాటర్‌ ట్యాంక్‌పై కొలువుదీరిన గణపయ్య.. భక్తుల నుంచి పూజలు అందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అయితే గత 20 ఏళ్లుగా వినాయకుడిని ఇలా వాటర్ ట్యాంక్‌పైనే ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. 20 ఏళ్ల క్రితం మండల కేంద్రంలోని వడ్లగేరిలో గణేశ్‌ మండపం ఏర్పాటు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఆ సమయంలో భారీ వర్షం కురవటంతో రోడ్లు చిత్తడిగా మారాయి. మండపం ఏర్పాటు చేసేందుకు అక్కడ అనువైన పరిస్థితి లేకుండా పోయింది. అప్పటికే స్థానికులు విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. దీంతో ఏం చేయాలో తోచక.. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ గుర్తొచ్చింది.


యువకులు, కాలనీవాసులు గణపయ్యను ట్యాంక్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రతిష్ఠించి ఆ ఏడాది పూజలు నిర్వహించారు. ఇక అప్పటి నుంచి వర్షాలు, బురద ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది గణేషుడుని ట్యాంకుపై ఏర్పాటు చేసి ఘనంగా పూజలు చేస్తున్నారు. వాటర్ ట్యాంకుపై ప్రతిష్ఠించడం వల్ల తమకు మంచి జరుగుతుందని, అందుకే ప్రతి ఏడాది లంబోదరుడిని అక్కడే ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. చెక్కలతో సెట్రింగ్‌ ఏర్పాటు చేసి.. క్రేన్ సాయంతో భారీ వినాయకుడి ప్రతిమను ట్యాంకు మధ్యలో ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. గ్రామస్థులు గణపయ్యను దర్శించుకునేందుకు వీలుగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు.


గ్రామస్తుల ఐడియాతో వానొచ్చినా.. వరదొచ్చినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా గణపయ్య పూజలు అందుకుంటున్నాడు. కాగా, వాటర్ ట్యాంకుపై కొలువుదీరిన వినాయకుడి ఫోటో ప్రస్తుతం సోషళ్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామస్థుల ఐడియా అదిరిందని కొనియాడుతున్నారు. వాట్ ఏ విజన్.. వాట్ ఏ థాట్.. వారి ఐడియాకు పిచ్చోళ్లైపోవాల్సిందేనని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. వాటర్ ట్యాంకును మల్టీ పర్పస్‌గా వాడకుంటున్నారని.. రోడ్లు బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయకుండా వినూత్నంగా ఆలోచించారని ప్రశంసిస్తున్నారు. తక్కుక ఖర్చుతో గొప్పగా ఆలోచించి మండపం ఏర్పాటు చేశారని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa