హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. ఈనెల 7న వినాయక మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించగా.. 3 రోజుల పాటు పూజలు నిర్వహించిన కొందరు గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈనెల 17న మహా నిమజ్జనం ఉండగా.. కొందరు 3, 5, 7 రోజుల్లోనే గణపయ్యలను గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు తీసుకొచ్చి నిమజ్జనం చేశారు.
అయితే ట్యాంక్బండ్లో గణేష్ నిమజ్జనాలు చేసే వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనానికి అనుమతి లేదంటూ హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారుల పేరుతో బ్యానర్లు కట్టారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో వేయకుండా సాగర్ చుట్టూ ఇనుప కంచెలతో భారీకేడ్లు ఏర్పాటు చేశారు.
వినాయక నిమజ్జనాలపై గతంలోనూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్తో పాటు నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయటానికి వీళ్లేదని ఆదేశాలిచ్చింది. పీవోపీ విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని సిటీ పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాల్చిచ్చింది. రసాయనాలతో తయారు చేసిన రంగుల వినాయకుల వల్ల చెరువుల కలుషితం అవుతాయని హైకోర్టు వెల్లడించింది. కేవలం మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేయాలని సూచించింది.
అయితే ప్రతి ఏటా హైకోర్టు ఆదేశాలు ఏమాత్రం అమలుకు నోచు కోవటం లేదు. చాలా మంది వినాయకులను హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి కూడా మూడో రోజే చాలా మంది విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భారీకేడ్లు ఏర్పాటు చేయటంతో పాటు ఫ్లెక్సీలు పెట్టారు. మరి మరి ఈసారైనా హైకోర్టు ఆదేశాలు పక్కాగా అమలవుతాయో లేదో వేచి చూడాలి. కాగా, ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఈనెల 17న హుస్సేన్ సాగర్లోనే జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa