తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి సాయంత్రం 4.30 గంటలకు రేవంత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో రేవంత్ చర్చలు జరపనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలు భర్తీ చేయాలని నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. టీపీసీసీగా బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావటంతో సామాజిక వర్గాల ఆధారంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేసులో ఉన్న పలువురు నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తామని రేవంత్ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెర్త్ కన్ఫార్మ్ అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి లేదా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిల్లో ఒకరి ఛాన్స్ పక్కా అని తెలిసింది.
ఇక పార్టీ మారే సమయంలోనే తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలించే ఛాన్స్ ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఇక మైనార్టీ వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చోటు కల్పించాలని భావిస్తున్నారు. షబ్బీర్ అలీ లేదా అజారుద్దీన్ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ ఏ సభలోనూ సభ్యులు కారు. దీంతో వీరిలో ఒకరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి పదవికట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.
వీటితో పాటుగా ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. పీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గం కూడా నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానంతో చర్చలు జరిపి రేపోమాపో మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు బర్తీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa