బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య విద్యలో స్థానికతను నిర్ణయించటానికి జీవో నెంబర్ 33ను ఉపసంహరించి.. ఆ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే.. గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో.. తెలంగాణ భవన్ వద్ద పోలీసులకు బీఆఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ పరిణామంతో.. తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఈ సందర్భంగా మాట్లాడిన గెల్లు శ్రీనివాస్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటం వల్ల రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీ హోదాకు దరఖాస్తు చేసుకోవటం వాళ్ల 50 శాతం కన్వీనర్ కోట సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని గెల్లు శ్రీనివాస్ వివరించారు. ఫలితంగా.. పేద,మధ్యతరగతి కుటుంబాలను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ కుట్రలో భాగంగానే.. జీవో 33ని కొనసాగించాలని సుప్రీం కోర్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశ్రయించిందని ఆరోపించారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టి.. ఇతర రాష్ట్రాల్లో చదివినవారికి స్థానికత వర్తించకుండా జీవో నెం 33 ద్వారా కన్వీనర్ కోట కింద సీటు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్దిచేకూర్చే కుట్ర జరుగుతోందన్నారు. అందుకే ఈ ప్రభుత్వం జీవో 33ని వెనక్కి తీసుకోవటమే కాకుండా.. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గెల్లు శ్రీనివాస్.
పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలని మాజీ సీఎం కేసీఆర్.. 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణలో.. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించి నిరుపేద విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులను అందిస్తే.. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం వైద్య విద్యను విద్యార్థులకు దూరం చేస్తోంది మండిపడ్డారు. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధమని ప్రశ్నించారు.
తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్గా మార్చి.. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీఓ 33ను అమలు చేసేంతగా.. కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత మొండిపట్టని గెల్లు శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందన్నారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే.. గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాజీనామా చేయాలని గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa