ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్వింటాకు రూ.500 బోనస్,,,ఈ ఖరీప్ సీజన్ నుంచే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 08:36 PM

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసింది. దాదాపు రూ.31 వేల కోట్లు రైతు రుణమాఫీ కోసం వెచ్చించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక రైతు భరోసా పథకం అమలుపై కూడా కసరత్తు చేస్తోంది. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.


సన్న వడ్లకు క్వింటాపై రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ ఖరీఫ్ నుంచే బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని అన్నారు. వరి సాధారణ రకానికి రూ.2,300, ఏ-గ్రేడు వరికి రూ.2,320 మద్దతు ధర ఉండగా.. రూ. 500 బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుందని మంత్రి వెల్లడించారు. కాగా.. దొడ్డు రకానికి కూడా బోనస్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వారి డిమాండ్లపై మంత్రి స్పందించలేదు.


ఇక రైతు భరోసా డబ్బులు విడుదలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇటీవల కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా డబ్బులు.. ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికి మాత్రమే ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు, సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితిలోనూ రైతుభరోసా ఇవ్వబోమని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది అనర్హులకు రైతుబంధు సాయం అందించిందన్నారు.


తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయబోదని అన్నారు. రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పంట వేసి.. సాగు చేస్తున్న రైతుల అకౌంట్లలో మాత్రమే రైతు భరోసా సాయం డబ్బులు పడతాయని చెప్పారు. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేలు రెండు విడతల్లో ఇవ్వనున్నట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.


ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులకు ఈనెలాఖరులోగా మాఫీ వర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. 2 లక్షలకు పైగా రుణం ఉన్న అన్నదాతలు.. ఎక్కువగా ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించాలన్నారు. ఆ తర్వాత.. మిగిలిన 2 లక్షలను ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa