ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో చైనా తర్వాత తెలంగాణనే బెస్ట్: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 07:46 PM

తెలంగాణకు భారీగా పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా.. ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం (సెప్టెంబర్ 18న) రోజున హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో నూతన ఎంస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం పాలసీలు కొనసాగించినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు చేసిన కృషిని ఎవరూ మరువలేరని కొనియాడారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే.. నూతన ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చిందని పేర్కొన్నారు.


పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో పరిశ్రమలకు ఉపయోగపడే వివిధ కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నారు. తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి దొరుకుతుందని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారని.. వాళ్లందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా తీర్చిదిద్ది.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు.


కరోనా సృష్టించిన విధ్వంసం తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి లాంటిదని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. పెట్టుబడులు పెట్టేందుకు చైనా తర్వాత తెలంగాణా రాష్ట్రమే బెస్ట్ డెస్టినేషన్ అని రేవంత్ రెడ్డి వివరించారు.


మరోవైపు.. తెలంగాణలో వ్యవసాయ పురోగతి సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అనేదే కాంగ్రెస్ ప్రభుత్వ విధామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు రూ. 2 లక్షల మేరు రుణాలు మాఫీ చేశామని తెలిపారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం మీద ఆధారపడితే.. మిగితావాళ్లు విభిన్న రంగాల్లో ఎదగాలని యువతకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమల అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa