పాకిస్థాన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన 'బ్రెయిన్ డ్రెయిన్' సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో బ్రతకడం దుర్భరంగా మారడంతో వేలాది మంది డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని వీడి విదేశాలకు వెళ్లిపోతున్నారు. పాక్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ భయానక వాస్తవాన్ని ప్రపంచం ముందు ఉంచాయి.
గత 24 నెలల్లోనే పాకిస్థాన్ తన దేశానికి చెందిన 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లను కోల్పోయింది. కేవలం కూలీలు, సామాన్య కార్మికులే కాకుండా దేశ గతిని మార్చగల మేధావులు కూడా విదేశాలకు తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2024లో సుమారు 7.27 లక్షల మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా.. ఈ ఏడాది నవంబర్ నాటికే ఆ సంఖ్య 6.87 లక్షలు దాటింది. ముఖ్యంగా నర్సుల వలసలు 2011తో పోలిస్తే ఏకంగా 2,144 శాతం పెరగడం గమనార్హం.
దేశం ఈ స్థాయిలో మేధావులను కోల్పోతుంటే. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇది 'బ్రెయిన్ డ్రెయిన్' కాదని.. భవిష్యత్తులో దేశానికి మేలు చేసే 'బ్రెయిన్ గెయిన్' అని ఆయన అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై పాక్ పౌరులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. "దేశం నాశనమవుతుంటే ఆయన పగటి కలలు కంటున్నారు" అని కొందరు, "అధికారం కోసం ప్రజలను హింసిస్తూ, మేధావులను బయటకు పంపి గర్వంగా మాట్లాడుతున్నారు" అని మరికొందరు మండిపడుతున్నారు.
పాక్ మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ ఈ పరిస్థితిని విశ్లేషిస్తూ.. రాజకీయాలను చక్కదిద్దకుండా ఆర్థిక వ్యవస్థను బాగు చేయలేమని హెచ్చరించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్ అయినప్పటికీ.. అక్కడ తరచూ విధిస్తున్న ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల 1.62 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని, 2.37 మిలియన్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
ఎయిర్పోర్టుల్లో ఆంక్షలు
మేధావుల వలసను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎయిర్పోర్టుల్లో తనిఖీలను కఠినతరం చేసింది. 2025లో ఏకంగా 66,154 మందిని విమానం ఎక్కకుండానే వెనక్కి పంపారు. భిక్షాటన ముఠాలు, అక్రమ వలసదారులను అడ్డుకోవాలనే సాకుతో సామాన్య నిపుణులను కూడా వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు లేక, కనీస వాక్ స్వాతంత్ర్యం లేని 'కఠిన దేశం'లో ఎవరూ ఉండాలనుకోవడం లేదని పాక్ విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa