ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా... వాహనదారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. రూల్స్తో సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తెలగాణలో సగటున రోజుకు 20 మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇందులో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రోడ్డు నిబంధనల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. నిబంధనలు పాటించని వాహనదారుల లైసెన్స్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం (సెప్టెంబర్ 25) రవాణాశాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. రవాణా శాఖ ఆదాయ మార్గాలు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారికి అవసరమైతే మోటారు వాహన చట్టం కింద లైసెన్సులు రద్దు చేయాలన్నారు.
ఇటీవల కరీంనగర్ జిల్లాలో వివాదాస్పదం అయిన ఇసుక, ఫ్లైయాష్ల ఓవర్లోడ్కు సంబంధించి తనిఖీలు విస్తృతం చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. వాటిపై విచారణ చేపట్టి అక్రమాలు అరికట్టాలని సూచించారు. ఇక స్కూళ్లు, కాలేజీ బస్సుల ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆటోల్లో విద్యార్థులను ఓవర్లోడ్తో తీసుకెళ్తున్న డ్రైవర్లపై కేసులు నమోదు చేసి శిక్షించాలన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
రాజ్భవన్ స్కూల్ రోడ్ సేఫ్టీకి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న రవాణా శాఖ కార్యాలయాలకు పక్కా భవనాల కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలన్నారు. తర్వలోనే స్థలాలు గుర్తించి కార్యాలయ భవనాలు నిర్మించాలని ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబరితి, ఉతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa