హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ తలపెట్టిన మూసీ సుందరీకరణ కార్యక్రమంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళనలు, ఆపోహలు చుట్టుముట్టాయి. ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు, అపోహలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న (సెప్టెంబర్ 28న) ప్రెస్ మీట్ పెట్టగా.. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు కూడా రంగంలోకి దిగారు. అయితే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు.
మూసీ ప్రాజెక్టుపై అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ బోర్డును ఏర్పాటు చేసుకుని ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములతో పాటు.. మూసీలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. తెలిసో, తెలియకనో కొంత మంది పేదలు మూసీలో ఇళ్లు కట్టుకున్నారని గుర్తుచేసిన మంత్రి శ్రీధర్ బాబు.. అలాంటి వారి జీవితాలను మెరుగుపర్చటమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
అయితే.. మూసీ రివర్ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మూసీ బాధితులకు న్యాయం చేస్తామని పూర్తి భరోసా ఇస్తున్నామన్నారు. బాధితులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని.. వాళ్లందరిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. గోదావరి నీటిని త్వరలోనే మూసీలో ప్రవహింపజేస్తామని చెప్పుకొచ్చారు. ఈస్ట్, వెస్ట్ సైడ్లో రోడ్లు వేస్తామని.. మూసీ మీద ఫైఓవర్లు నిర్మిస్తామని వివరించారు. పీపీపీ మోడల్లో నిర్మాణాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే.. 35 బృందాలతో సోషియో ఎకనమిక్ సర్వే చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలో పేదలకు వాక్ టూ వర్క్ పద్ధతిలో ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నామన్నారు. ప్రస్తుతం 12 ఎన్జీవో ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామన్న శ్రీధర్ బాబు.. సొంత ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు బాధితులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు.
ఆ ఇళ్లలో సీఎం, మంత్రులను ఉండమనండి.. 'మూసీ' కూల్చివేతలపై సామాన్యుల స్పందన
బాధితుల కోసం.. అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని.. వారి పిల్లలను ఆరేళ్ల పాటు చదివిస్తామని మంత్రి తెలిపారు. స్వయం సహాయక మహిళా గ్రూపులతో బాధితులందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కోసం హైలెవల్ కమిటీ ఇప్పటికే పనిచేస్తోందని తెలిపారు. రివర్ బెడ్ గుర్తించే నివాసాలకు కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు.
ఇదే క్రమంలో.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. మల్లారెడ్డి అనే ఓ రైతు చితిపెట్టుకొని సజీవదహనమైన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. నిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకే ఎంతమాత్రం లేదని మంత్రి మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa