ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ డీపీఆర్ సిద్ధం,,,,ఆ మార్గంలో 40 కి.మీ.తో కొత్త లైన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 06:50 PM

సంచలన నిర్ణయాలతో ప్రతి పనిలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే.. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణలో భాగంగా.. సెకండ్ ఫేజ్ నిర్మాణానికి కసరత్తు చేస్తుండగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు.. అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. సుమారు మొత్తం 116 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రెండో దశ పనులు జరగనుండగా.. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. అయితే.. ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.


అయితే.. 32 వేల 237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నారు. అంతేకాకుండా.. ఈ దశలో ఇప్పటికే ఉన్న ఐదు కారిడార్లతో పాటు.. కొత్తగా శంషాబాద్‌ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూటర్ సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీ వరకు మొత్తంగా 40 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మరోవైపు.. ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లోనూ కూడా ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఆరాంఘర్- బెంగళూరు హైవేలో కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో లైనును సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు.


అయితే.. కారిడార్-4లో భాగంగా.. నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ఎయిర్ పోర్టు కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో మెట్రో లైన్ రానుంది. ఇక.. కారిడార్-5లో భాగంగా రాయ్‌దుర్గ్‌ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు.. కారిడార్-6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణ్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్లు.. కారిడార్-7లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్‌చెరువు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్- 8లో భాగంగా ఎల్భీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు.. మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


అయితే.. కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. అధికారులు కారిడార్-9కి కూడా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మొత్తంగా శంషాబాద్‌ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 8 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త మార్గాన్ని నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. కేంద్ర అనుమతుల కోసం మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పంపించారు. ఇప్పటికే మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాగా.. ఈ రెండో దశ కూడా పూర్తయితే మొత్తంగా 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం పూర్తయినట్టవుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa