ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరాలోపు నియామకాలు, గ్రూప్-1 రిజల్ట్స్ అప్పుడే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 07:27 PM

తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో తీపికబురు వినిపించారు. దసరా పండగలోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. 11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


అయితే.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్లలో వాళ్లు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమేనన్నారు. విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదని.. తాము అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఇది విద్యపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని రేవంత్ రెడ్డి తెలిపారు.


తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ నిర్వహించామన్నారు. టీజీపీస్సీని ప్రక్షాళన చేశామని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు.


మొదటి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదు.. అది భావోద్వేగమని అభివర్ణించారు. గత పదేళ్లలో విద్య నిర్లక్ష్యానికి గురైందన్నారు. తాము వచ్చాక విద్య శాఖకు నిధుల కేటాయింపు పెంచామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించలేదని.. అందుకే తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందన్నారు.


100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధిరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిందని తెలిపారు.


కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై మాపై దుష్ప్రచారం చేస్తున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి.. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, అందుకే ఈ ఉపద్రవం వచ్చిందన్నారు. వాటన్నింటిని పరిష్కరించుకుంటూ తాము ముందుకెళుతున్నామన్నారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని తాము భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తామన్నారు. పేదలకు విద్య అందించడమే తమ విధానమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa