మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం శుభవార్త వినిపించింది. నగరవాసులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించేందుకు కట్టుబడి ఉన్న హైదరాబాద్ మెట్రో.. ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి రెండు కీలక కార్యక్రమాలను ప్రకటించింది. ఇప్పటికే జనాధరణ పొందిన కస్టమర్ ఆఫర్లను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్ను అనుసరించి.. జనాధరణ పొందిన మూడు బంపర్ ఆఫర్లను మార్చి 31, 2025 వరకు పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రయాణికులకు భారీగా డబ్బులు ఆదా చేయనున్నాయని సంస్థ యాజమాన్యం చెప్తోంది.
గడువు పొడిగించిన ఆఫర్లు ఇవే..
సూపర్ సేవర్ ఆఫర్-59: కేవలం రూ.59తో అపరిమిత ప్రయాణాన్ని ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ లిస్టెడ్ సెలవుల్లో ఆస్వాదించవచ్చు.
స్టూడెంట్ పాస్ ఆఫర్: విద్యార్థులు 20 ట్రిప్పులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ప్రత్యేక ఆఫర్, ఇది మెట్రో ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెస్తుంది.
సూపర్ సేవర్ ఆఫ్-పీక్ ఆఫర్: రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డ్లపై (సీఎస్సీలు) 10 శాతం తగ్గింపును పొందండి.
ఈ బంపర్ ఆఫర్లను పొడిగించటమే కాకుండా.. సురక్షితమైన, సౌకర్యవంతమైన పార్కింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అక్టోబర్ 6, 2024 నుంచి ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ నాగోల్తో పాటు మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ రుసుములను వసూలు చేయటం మొదలు పెడుతున్నట్టు స్పష్టం చేసింది.. ఈ పార్కింగ్ స్థలాలు ప్రయాణీకుల సౌలభ్యంతో పాటు భద్రతను నిర్ధారించడానికి అనేక సౌకర్యాలను అందించనున్నట్టు యాజమాన్యం తెలిపింది.
ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్
ప్రయాణికుల కోసం బయో-టాయిలెట్లు
సాయంత్రం వేళల్లో తగిన వెలుతురు కోసం దీపాలు
24/7 భద్రత, సీసీటీవీ కవరేజ్
లావాదేవీల సౌలభ్యం కోసం యాప్/క్యూ ఆర్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ
స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం
సులభమైన పార్కింగ్, యాక్సెస్ కోసం లేన్ గుర్తింపు
మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
సమీప ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ వంటి అత్యవసర సంప్రదింపు వివరాల ప్రదర్శన
ప్రస్తుతం.. బయో-టాయిలెట్లు, సీసీటీవీ కవరేజ్, చెల్లింపు వ్యవస్థలు వంటి సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని.. మిగిలిన ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావటానికి చురుకుగా పనులు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఈ క్రమంలో.. ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్, ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. "కొత్త పార్కింగ్ సౌకర్యాలను కూడా పరిచయం చేయటంతో పాటుగా ప్రయాణీకులకు మరింత కాలం పాటు మా ఆఫర్ల ప్రయోజనాలను అందించనుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాలు ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడంలో ప్రయాణాల కోసం ప్రాధాన్యతా మార్గంగా హైదరాబాద్ మెట్రోను తీర్చిదిద్దడంలో అంకితభావాన్ని చూపిస్తున్నాయన్నారు. స్థోమత, సౌలభ్యం, యాక్సెసిబిలిటీని మిళితం చేయటం ద్వారా మేము హైదరాబాద్కు మరింత స్థిరమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం." అని తెలిపారు.
ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరదరాజన్ మాట్లాడుతూ.. "జనాదరణ పొందిన కస్టమర్ ఆఫర్ల పొడిగింపుతో పాటు సురక్షితమైన, సౌకర్యవంతమైన పార్కింగ్ సౌకర్యాల పరిచయం, అందరికీ సౌకర్యవంతమైన, సరసమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. మేము మా సేవలను నిరంతరం మెరుగుపరచడానికి, నగర ప్రయాణ మాధ్యమాల్లో కొత్త బెంచ్మార్క్లను నిర్దేశించటానికి కట్టుబడి ఉన్నాం." అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa