మూసీ సుందరీకరణ, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే తీసుకొచ్చారన్నారు. హైడ్రా వెనుక సీఎం రేవంత్ కాదని.. రాహుల్ గాంధీ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కేవలం డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చారన్నారు. ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం మూసీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని.. మూసీ లూటీఫికేషన్ అని ఎద్దేవా చేశారు.
'ఒకటి రెండు రోజుల్లో మూసీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. 16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ స్కాంపై వివరాలు వెల్లడిస్తా. పేదల ఇండ్లకు నష్టం జరగకుండా మూసీని ఏ విధంగా ప్రక్షాళన చేయవచ్చో ప్రజలకు వివరిస్తాం. మూసీ నదికి ఇరువైపుల బంగారు తాపడం చేపిస్తే తప్ప లక్షన్నర కోట్లు ఖర్చు అవ్వదు. మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్కి లాభం తప్ప.. సాధారణ ప్రజలకి ఒరిగేదీమీ లేదు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ కారణంగా సిటీలోని 35 లక్షల మంది కార్మికుల ఉపాధి పోయింది.
మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకుగా తయారుచేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం మూసీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ అయినా ఉందా? నమామి గంగే ప్రాజెక్ట్లో కిలోమీటర్కు అయిన ఖర్చు 17 కోట్లు. మూసీకి మాత్రం కిలోమీటర్కు 2,700 కోట్లు ఖర్చు చేస్తారంట. మరి ఇది స్కాం కాకపోతే ఏంటీ?లక్షలాది మంది పేదల కుటుంబాలకు అన్యాయం చేస్తామంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉరుకోం. దొంగ చాటున సర్వేలు చేస్తుంటే.. లక్షల మంది ప్రజలకు ఇంట్లో పండుగ సంతోషం లేకుండా పోయింది.' అని వ్యాఖ్యనించారు.
ఇక మంత్రి కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు కేటీఆర్. వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదని.. ఆయనకి ఏం తెలియదని అన్నారు. ఆయనకు దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని సవాల్ విసిరారు. మూసీపై ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ)పై కూడా ఆయనకు అవగాహన లేదున్నారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళణ అవుతాయన్నారు.
కొండా సురేఖ్ ట్రోలింగ్ అంశంపై మాట్లాడుతూ.. ఆమె దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికని ప్రశ్నించారు. తమ ర్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో తమననా ట్రోలింగ్ పేరుతో దాడి జరగిందని చెప్పారు. గతంలో ఆమె తమ గురించి మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు.
'ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? గతంలో ఇదే కొండా సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా..? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకూ, మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి.' అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa