ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీకి చెడ్డ పేరు వస్తే నా కాంగ్రెస్ రక్తం సహించదు.. సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేఖ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 07:25 PM

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహచరుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు. తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని కోరారు. ‘ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి. నేనే నా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా’ అని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (అక్టోబర్ 4) లేఖ రాశారు కేవీపీ. ‘చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. పార్టీకి చెడ్డ పేరు వస్తే, నా కాంగ్రెస్ రక్తం సహించదు’ అని లేఖలో కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు.


సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో గురువారం (అక్టోబర్ 3) జరిగిన కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ గురించి మాట్లాడుతూ.. కొంత మంది పెద్దల ఫామ్ హౌస్‌లను కూల్చుదామంటే, పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేవీపీ రామచంద్రరావు పేరును సైతం ప్రస్తావించారు.


‘బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో కలుస్తోంది. ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా? కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్‌లను కూల్చేయాలా? వద్దా?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


‘మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు..? మీ భరతం పట్టడం ఖాయం’ అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘హైదరాబాద్‌లో నగరంలో ట్రాఫిక్, వరద సమస్యలను పరిష్కరించేందుకు మేం చర్యలు చేపడుతుంటే.. బావ, బావమరిది మాపై బురద చల్లుతున్నారు’ అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే, బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినా.. అంతకుముందే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పేరును సైతం ప్రస్తావించడంతో ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతపైనే సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారని సోషల్ మీడియాలో వార్తలు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవీపీ రామచంద్రరావు స్పందించారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు. ‘పేదలకు నష్టం లేకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని పనులను స్వాగతిస్తున్నాను. మీరు, నేను కలుగజేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దాం. కొంత మంది నేతలు వారి స్వప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని ప్రజలకు తెలుసు. మీ లక్ష్యాన్ని దెబ్బతీసే కొంత మంది ప్రయత్నాలను నేను ఖండిస్తున్నా’ అని కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa