ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో రుణమాఫీపై పీఎం నరేంద్ర మోదీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:43 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేసిన రైతు రుణమాఫీ పథకంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. శనివారం (అక్టోబర్ 05న) రోజు మహరాష్ట్రలోని వాసింలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలపై, ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో అమలు చేసిన రుణమాఫీ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు రుణమాఫీ పూర్తి చేయలేదంటూ మోదీ విమర్శించారు.


రుణమాఫీ ఎందుకు చేయట్లేదని తెలంగాణలో రైతులు రోడ్డెక్కి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని నరేంద్ర మోదీ వివరించారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు మర్చిపోవద్దని మోదీ సూచించారు. కర్ణాటకలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంతకు ముందున్న బీజేపీ ప్రభుత్వం రైతులకు అందజేసిన ఆర్థిక సాయాన్ని ఆపేసిందంటూ మోదీ ధ్వజమెత్తారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్, మహా వికాస్ అఘాడీని ఏమాత్రం విశ్వసించొద్దని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.


ఇటీవల.. ఢిల్లీలో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపిన మోదీ.. ఈ కేసులో ఓ కాంగ్రెస్ నాయకుడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. యువతను కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్యాలవైపు నెట్టి.. వాటి ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికలకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. దేశ వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన అజెండాను ఓడించేందుకు మహారాష్ట్ర ప్రజలంతా ఏకం కావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.


ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. అయితే.. ఆగస్టు 15 వరకు 2 లక్షల మేర రుణాలు ఉన్న వారందరికీ సుమారు 18 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండగా.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాత్రం ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్తుండటం.. ఇప్పుడు గందరగోళంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa