ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి అమాయకులే టార్గెట్గా మోసాలు చేస్తున్నారు. ఇలా సైబర్ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ ముఠాను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేటుగాళ్లను అరెస్టు చేశారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మెుత్తం18 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఒక్క తెలంగాణలోనే 45కుపైగా కేసులు ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా మరో 319 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కొరియర్, స్టాక్ మార్కెట్ పెట్టుబడి, సెక్స్ టార్షన్, సీబీఐ, ఈడీ, డ్రగ్స్ పేరుతో వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల బ్యాంకు అకౌంట్లోని రూ.1.61 కోట్ల నగదును సీజ్ చేశారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 26 సెల్ఫోన్లు, 16 ఏటీఎం కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో.. బాధితుల నుంచి ఈ కేటుగాళ్లు రూ.6.94 కోట్లు కొట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ముంబై కేంద్రంగా వీరు సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ వస్తే స్పందించవద్దని నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలను ఎట్టి పరిస్థితిలో నమ్మెద్దని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వీరితో జాగ్రత్త.. ఇక చోరీలకు పాల్పడే తమిళనాడు ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, ట్రాఫిక్ కూడళ్లను ఎంపిక చేసుకొని చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. భార్యభర్తలుగా నటించి దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పారు. ఒంటిపై ఉమ్మిపడిందని, వెహికల్ టైర్లలో గాలిపోయిందంటూ ఏమార్చి వారికి తెయికుండానే వస్తువులు కాజేస్తునట్లు తెలిపారు. చిరువ్యాపారులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. బంగారపు కడ్డీ దొరికిందని తక్కువ ధరకు ఇస్తామంటూ అమాయకులను మోసగిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులుగా నటిస్తూ పక్కనే ఉండే వారి సెల్ఫోన్లు, గడియారాలు, బంగారు గొలుసులు అపహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తరహా ముఠాలు సుమారు 10 వరకు నగరంలో సంచరిస్తున్నట్లు తెలిపిన పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa