ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవా ట్రిప్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:54 PM

హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అయితే అక్కడకు వెళ్లేందుకు రకరకాల సాధనాల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. కొందరు సొంత వాహనాల్లో వెళితే.. మరికొందరు విమానాల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. హైదరాబాద్ నుంచి గోవాకు డెరెక్ట్‌గా ట్రైన్ అందుబాటులో లేకపోవటంతో టూరిస్టులు ఇబ్బందులు పడేవారు. ఇక నుంచి ఆ టెన్షన్ అక్కర్లేదు. హైదరాబాద్ నగరం నుంచి గోవాకు డెరెక్ట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది.


సికింద్రాబాద్- వాస్కోడిగామా వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్‌ను నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని బోయిగూడ వైపు ఉన్న పదో నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి గోవా ట్రైన్ సర్వీసును ప్రారంభించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో గోవా రాజధాని వాస్కోడిగామాకు మెరుగైన అనుసంధానం కోసం ఈ ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ట్రైన్ వారానికి రెండు రోజులు రెండు మార్గాల్లో నడిపిస్తారు. ప్రస్తుతం కర్నాటక, గోవా ప్రాంతాలకు వెళ్లేందుకు తెలుగు వారికి ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి.


ఈ నేపథ్యంలో వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించేందుకు సికింద్రాబాద్ నుంచి ఈ ప్రత్యేక ట్రైన్ నడిపిస్తున్నారు. ఈ ట్రైన్ 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గంటల్లో చేరుకుంటుంది. ఈ ట్రైన్ వెళ్లే మార్గం ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ వెళ్తుంది. ఎల్ హెచ్ బీ కోచ్‌లతో తీసుకొచ్చిన అత్యాధునిక ట్రైన్ ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది.


ఈ ట్రైన్ రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుంచి ఈ నెల 9న, వాస్కోడిగామా నుంచి ఈ నెల 10న ప్రారంభమవుతాయి. ఈ రైలు హైదరాబాద్ నుంచి కర్ణాటక, గోవాకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వారంలో ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.05 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామాకు చేరుకుంటుంది. ఇక ప్రతి గురువారం, శనివారాలలో ఉదయం 6 గంటలకు వాస్కోడిగామా నుంచి బయల్దేరి మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుంది.


ఇక ఈ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గదడ్, హుబ్బలి, దర్వాడ్, లోండా, మడగాన్ మీదుగా మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు చేరుకుంటుంది. ఇతర రవాణా సాధనాలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఈ ట్రైన్‌లో గోవాకు చేరుకోవచ్చు. టికెట్ ధరల విషయానికొస్తే.. స్లీపర్, థర్డ్ ఎకానమీ, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ బోగీలు ఉంటాయి. ఫస్ట్ ఏసీ రూ.3,280, టూటైర్ ఏసీ రూ.2120, త్రీటైర్ ఏసీ రూ.1530, థర్డ్ ఎకానమీ రూ.1415, స్లీపర్ క్లాస్ ధర రూ.565గా నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa