ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అలిగిన బతుకమ్మ.. ఆ అలక వెనుక ఉన్న కథేంటీ..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:49 PM

తెలంగాణలో పూల పండుగ బతుకమ్మ సంబురాలు, నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి (అక్టోబర్ 02వ తేదీన) ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు ముగుస్తాయి. అయితే.. ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండటం విశేషం. అందులోనూ.. ఆరో రోజుకు మాత్రం ఆసక్తికరమైన కథ ఉంటుంది. ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు (ఆరో రోజున) అలిగిన బతుకమ్మగా పిలుచుకుంటారు. అయితే.. అన్ని రోజుల్లో బతుకమ్మను పేరుస్తారు.. రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ.. ఈ ఆరో రోజున మాత్రం పూలతో బతుకమ్మను పేర్చరు.. ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు. అసలు బతుకమ్మ ఎందుకు అలిగింది.. ఆరో రోజున బతుకమ్మను ఎందుకు పేర్చరనేదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.


అయితే.. పూర్వంలో ఆరో రోజున కూడా బతుకమ్మను పేర్చేవారంటా. కానీ మధ్యలో నుంచి ఈ అలిగిన బతుకమ్మ సంప్రదాయం వచ్చినట్టు తెలుస్తోంది. పూలనే దైవంగా జరుపుకునే పండుగ కావటం.. ఆ గౌరమ్మనే పూలల్లో చూసుకుని పూజిస్తూ.. బతుకమ్మను పేర్చుకోవటం ఆనవాయితీగా వస్తుండటంతో.. బతుకమ్మలను పేర్చే సమయంలో చాలా నిష్టగా ఉంటారు. చాలా మంది ఉపవాసంతో బతుకమ్మను పేర్చుతుంటారు.


అయితే.. పూర్వం ఒకానొక సమయంలో.. బతుకమ్మను పేరుస్తున్న సమయంలో.. అనుకోకుండా బతుకమ్మకు మాంసం ముద్ద తగిలిందట. దీంతో.. అపచారం జరిగిందని భావించారట. అంతేకాదు.. ఈ అపచారంతో బతుకమ్మ అలిగిందని.. ఈరోజు ఏమీ తినదని.. ఓ పూరాణ గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆరో రోజున పూలతో బతుకమ్మను పేర్చరు. నైవేద్యం కూడా ఏమీ సమర్పించరు. ఈ ఆరో రోజున ఆడపడచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తూ.. గౌరమ్మను కొలుస్తూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. ఇక మళ్లీ ఏడో రోజు నుంచి బతుకమ్మను పేర్చుతూ యథావిధిగా బతుకమ్మ సంబురాలను కొనసాగిస్తారు.


ప్రతి ఏడాది.. భాద్రపద అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి. తంగెడు, గునుగు లాంటి పూలతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చుతారు. ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో ఒక్కో రోజు.. గౌరమ్మకు ప్రత్యేకమైన ప్రసాదాలు సమర్పిస్తుంటారు. ఆడపడుచులంతా ఒకరికొకరు వాయినాలు కూడా ఇచ్చుకోవటం అనవాయితీ.


ప్రస్తుతం బతుకమ్మ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగానే కాకుండా విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా ఈ సంబురాన్ని ఘనంగా జరుపుకుంటుంటున్నారు. ఇటీవలే అగ్రరాజ్యమైన అమెరికాలోని పలు రాష్ట్రాల్లో బతుకమ్మను అధికారికంగా గుర్తించి.. తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించారు. దీంతో.. తొమ్మిది రోజుల పాటు అమెరికాలో కూడా ఘనంగా బతుకమ్మ సంబురాలు జరుగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa