ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరంలో ఎక్కడ్నుంచైనా మెట్రోలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. సర్కార్ కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 07:31 PM

ఆరు కారిడార్లతో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇటీవల డీపీఆర్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫేజ్‌లో మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేయనున్నారు. అందుకు రూ.32,237 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తూ.. డీపీఆర్‌లను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని నిర్ణయించాయి. కాగా, మెట్రో సెకండ్ ఫేజ్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదిత కొత్త కారిడార్‌-4కు ప్రస్తుతమున్న మూడు కారిడార్లను కనెక్ట్ చేయనున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఏ వైపున ఉన్న ప్రయాణికులైన సౌకర్యవంతంగా మెట్రోలో ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా కారిడార్‌-1, 2, 3లను కొత్త కారిడార్‌-4కు కలపనున్నారు.


నాగోల్‌ నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కి.మీ. మార్గాన్ని మెట్రో ప్రతిపాదించింది. దీనికి సంబంధించి డీపీఆర్‌ తుది మెరుగులు దిద్దుకుంటోంది. కారిడార్-4లో మెుత్తం 24 స్టేషన్లు ఉండనున్నాయి. నాగోల్, నాగోల్ క్రాస్ రోడ్, అల్కపురి, కామినేని, ఎల్బీనగర్, బైరామల్ గూడ, మైత్రినగర్, కర్మాన్‌‌‌‌ఘాట్, చంపాపేట్, ఒవైసీ హాస్పిటల్, DRDO, బాలాపూర్ రోడ్, చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ, మైలార్‌‌‌‌దేవ్‌‌‌‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, శతంరాయి, సిద్ధాంతి, శంషాబాద్ జంక్షన్, ఎయిర్పోర్టు కార్గో, ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మించనున్నారు.


ప్రస్తుతం కారిడార్-1 ఎల్బీనగర్-మియాపూర్ వరకు ఉంది. కారిడార్-2 జేబీఎస్-ఎంజీబీఎస్ ఉంది. కారిడార్-3 రాయదుర్గం- నాగోల్ ఉంది. ఈ మూడు కారిడార్లను కారిడార్-4కు అనుసంధానం చేయనున్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ కారిడార్‌కు కలుపుతారు. కారిడార్‌-2ను ఫలక్‌నుమా చాంద్రాయణగుట్ట వరకు విస్తరిస్తారు. అక్కడ అతిపెద్ద జంక్షన్‌ స్టేషన్‌ నిర్మించి ఎయిర్‌పోర్టు మెట్రోకు అనుసంధానిస్తారు. ఇలా నాలుగు కారిడార్లు కలపటం ద్వారా నగరంలో ఏ మూలన ఉన్నవారైనా మెట్రోలో సౌకర్యవంతంగా ఎయిర్‌పోర్టుకు చేరుకునే వీలు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


ఎయిర్‌‌‌‌పోర్ట్ మెట్రో అలైన్‌‌‌‌మెంట్‌ను ప్రభుత్వం మార్చింది. గతంలో పీ7 రోడ్ నుంచి ఎయిర్పోర్టు మెట్రో అలైన్‌మెంట్ ఖరారు చేయగా.. తాజాగా కొత్త హైకోర్టు మీదుగా మెట్రోను ప్రతిపాదించారు. కొత్త హైకోర్టు మీదుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని అందులో భాగంగానే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మెట్రో అధికారులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa