ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో వెలుగులోకి భారీ స్కాం.. ఏకంగా రూ.7 వేల కోట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 07:42 PM

హైదరాబాద్‌లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేసి డీబీ బ్రోకింగ్ కంపెనీ దుకాణం ఎత్తేసింది. సుమారు రూ.7 వేల కోట్ల స్కాం జరగినట్లు పోలీసులు గుర్తించగా.. డీబీ స్ట్రాక్ బ్రోకింగ్ చైర్మన్ అస్సాం రాష్ట్రానికి చెందిన దీపాంకర్ బర్మన్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌తోపాటు ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గౌహతి, ఢిల్లీలోనూ వీరిపై కేసులు నమోదయ్యాయి. అమాయకుల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టించి స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 23 వేలకు పైగా బాధితులు ఉన్నట్లు అంచనా.


2018లో కార్యకలాపాలు ప్రారంభించిన డీబీ స్టాక్ బ్రోకింగ్.. అధిక వడ్డీ రాబడితో పథకాలను అందించడం ద్వారా వేలాది మంది క్లయింట్‌లను తనపైపు తిప్పుకుంది. 120 శాతం వడ్డీతో వార్షిక పథకం, 54 శాతంతో అర్ధ వార్షిక పథకం, 7 శాతం వడ్డీ అందించే నెలవారీ పథకాలు వీరి సంస్థలో ఉన్నాయి. డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పుప్పల్‌గూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పంచాక్షర్ సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధిక వడ్డీ, రిటర్న్స్ ఆశచూపి డబ్బులు కట్టించుకున్నట్లు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వడ్డీ పక్కన పెడితే అసలు కూడా ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం మోసం చేసిందని అతడు వాపోయాడు. తనలాగే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు.


హైదరాబాద్‌ నగరానికే చెందిన గంటాడి హరీష్ కూడా రెండేళ్ల క్రితం డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో రూ. 88.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే అతడికి కొంత వడ్డీ చెల్లించి అసలుతో కంపెనీ యాజమాన్యం పరారైంది. నగరానికే చెందిన విశ్వజీత్ సింగ్ సైతం కంపెనీలో రూ. 36.80 లక్షలు పెట్టుబడి పెట్టగా.. అతడికి రూ. 16.20 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా లాక్ చేశారు. రాజు మహేంద్ర కుమార్ అనే వ్యక్తి సైతం రూ. 26 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఈ ఏడాది జూలై నుంచి కంపెనీ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయని బాధితులు వాపోయారు. కేపీహెచ్బీ కాలనీలో ఓ బ్రాంచీ ఓపెన్ చేసిన నిర్వహకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కంపెనీ ఎత్తేశారు.


దాదాపు 23 వేల మంది పెట్టుబడిదారులను మోసగించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్‌ను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు ముందుకు రావాలని పోలీసులు సూచించారు. ఈ మోసానికి సంబంధించి అస్సాం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బర్మాన్.. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి కనిపించకుండా పోయాడు. అతను ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బర్మాన్ తన కార్యకలాపాలను ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియాలో విస్తరించాలని ఫ్లాన్ చేసినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa