అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరోవైపు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే.. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లాంటి పథకాలను త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ క్రమంలోనే మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
మంగళవారం (అక్టోబర్ 08న) రోజున ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పదేళ్లుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పెడింగ్లో ఉన్న ప్రమోషన్లు ఇచ్చామని భట్టి తెలిపారు. విద్యుత్ శాఖలోని ఉద్యోగులపై భారం తగ్గించే దిశగా.. ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ క్రమంలోనే.. మరో కీలక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందన శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని భట్టి ప్రకటించారు. విద్యుత్ సంబంధిత సమాచారం.. ఫిర్యాదుల కోసం1912 హెల్ప్ లైన్ నెంబర్ను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
పునరుత్ఫాదక ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు రచిస్తోందని భట్టి తెలిపారు. ఇందుకు అవసరమైన బడ్జెట్ను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కరెంట్ ట్రిప్ కాకుండా అవసరం మేరకు ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు పంటతో పాటు పవర్తోనూ ఆదాయం వచ్చేలా వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు ఇవ్వబోతున్నట్టు భట్టి ప్రకటించారు. ఈ క్రమంలోనే.. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. రైతుల దగ్గరి నుంచే ప్రభుత్వం విద్యుత్ను కొనుగోలు చేయబోతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. గ్రామాల్లో ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబోతుందని భట్టి విక్రమార్క తెలిపారు.
మరోవైపు.. ఖమ్మం పరిసర ప్రాంతంలో అవసరం అయినన్ని సబ్ స్టేషన్లు నిర్మిద్దామని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. ఎక్కడ కూడా విద్యుత్ స్తంభాలు, వైర్లు వేలాడి ఉండకూడని ఆదేశించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకుని మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో లైన్మెన్లు సరిగ్గా పని చేయకపోతే చెడ్డపేరు వస్తుందని వివరించారు. అందుకే క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa