విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు.. ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నగరం అభిృద్ధి చెందుతూ విశాలంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. రవాణా వ్యవస్థను కూడా అదే స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే.. విశేష జనాదరణ పొందుతున్న హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని కూడా విస్తరించేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఫైనల్ రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఇక.. భూసేకరణ చేసి పిల్లర్లు వేయటమే లక్ష్యంగా అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. రెండో దశ మెట్రో నిర్మాణంలో భాగంగా.. సికింద్రాబాద్, ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ మీదుగా ఔటర్రింగ్ రోడ్డు వరకు మెట్రోను విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. అయితే..ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన రెండో దశ డీపీఆర్లో మాత్రం ఆ రూట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అయితే.. తమ ప్రాంతానికి మెట్రో వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ ప్రాంతానికి మెట్రో తీసుకురావటమే లక్ష్యంగా.. మేడ్టర్ మెట్రో సాధన సమితి పేరుతో ఓ సంఘంగా ఏర్పడి.. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి తమ డిమాండ్ వినిపించారు.
అయితే.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నగరానికి నలువైపులా మెట్రో సేవలను విస్తరించాలన్న భావనతో.. 278 కిలోమీటర్ల మేర ప్రణాళికలను రూపొందించారు. కాగా.. ఇప్పుడు మొత్తం 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్లకే రెండో దశను పరిమితం చేశారు. ఎయిర్పోర్టు మెట్రోతో పాటు కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. అయితే.. గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసిన.. మేడ్చల్ మెట్రోకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేకపోవటం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది.
అయితే.. ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకుగానూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించ తలపెట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. భూసేకరణ ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. అయితే.. కేవలం ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే కాకుండా.. అదే మార్గంలో మెట్రో మార్గాన్ని కూడా విస్తరించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.1,580 కోట్ల అంచనాలలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి.. అదే మార్గంలో డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి తాడ్బంద్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీఫాం రోడ్డు వరకు మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించారు. అది పూర్తయిన తర్వాత.. ఎలివేటెడ్ కారిడార్పైన మెట్రో నిర్మాణం చేపట్టాలని కూడా నిర్ణయించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఊసే లేకపోవటం గమనార్హం.
దీంతో.. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్తో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ నేతృత్వంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆవిర్భవించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా.. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ మెట్రో కారిడార్ నిర్మించాలని.. ప్యారడైజ్ నుంచి కండక్లకోయ వరకు 12 కిలోమీటర్ల మార్గంలో, ఓఆర్ఆర్ మేడ్చల్ ఇంటర్ఛేంజ్కు రాకపోకలు సాగించేలా మెట్రో సదుపాయం కల్పించాలని మేడ్చర్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa