ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు బిగ్ అలెర్ట్.. అలా చేస్తే లైసెన్సులు రద్దు.. అమల్లోకి కొత్త వాహన చట్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 10:01 PM

వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఇక నుంచి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ మేరకు కొత్త సంస్కరణలు తీసుకురానున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సారథి వాహన్ పోర్టల్ మీద.. మంగళవారం (అక్టోబర్ 08న) రోజున సచివాలయంలో.. సంబంధిత శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవాణ శాఖలో రెండు మూడు కొత్త సంస్కరణలను అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి ప్రకటించారు.


సారథి వాహన్ పోర్టల్‌‌లో తెలంగాణ కూడా భాగస్వామి అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 28 విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా 12 నెలల గ్యాప్‌లోనే రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ ఆఫీసులను కంప్యూటరైజ్డ్ చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు.. ప్రైవేటు వాహనాల వాలంటరీ స్క్రాపింగ్ పాలసీలో భాగంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ట్యాక్స్ మినహాయింపును ఇస్తామని పొన్నం ప్రకటించారు.


కొత్త మోటారు వాహన చట్టంలో భాగంగా.. దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలను అధ్యయనం చేసి.. జీవో తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వాహనాల చెకింగ్‌కు సరైన విధానం అమలుకావట్లేదని.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. ఒక్కో సెంటర్‌కు రూ.8 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన పొన్నం.. అలాంటివి రాష్ట్రంలో 32 సెంటర్లు తీసుకొస్తున్నామన్నారు.


తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతపై యునిసెఫ్ సహకారం కూడా తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి పాఠశాలలో రోడ్డు సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన కలిస్తున్నామన్నారు. వచ్చే నెలలో "రోడ్డు సేఫ్టీ మంత్" పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి అమలు చేస్తున్న నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారి వాహనాల రద్దు చేస్తామని హెచ్చరించిన పొన్నం.. లైసెన్స్ రద్దయితే వాళ్లు మరే ఇతర వాహనాలు కొనడానికి ఉండదు.. వాహనాలు నడపడానికి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 8 వేల లైసెన్సులు రద్దు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa