ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ప్రభుత్వ కార్యక్రమం తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోంది: మంత్రి కోమటిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 08:17 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తాము బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. బీసీ కులగణన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. నేడు గాంధీ‌భవన్‌‌లో కుల‌ గణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. బీసీ కుల గణన తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని మండిపడ్డారు. ఏడాది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని కోమటిరెడ్డి జోష్యం చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పని తీరే ఇందుకు కారణమన్నారు. కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఐదుగురు ఎమ్మెల్యేలతో పోరాటం చేశారని గుర్తు చేసారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదని అన్నారు.


పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా దూసుకెళ్తున్నామని చెప్పారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరగ్ మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరటం కాదని.. బీఆర్ఎస్ నుంచే మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యనించారు. కానీ తామే చేర్చుకోవటం లేదని అన్నారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిలదీస్తామన్న భయంతోనే కేసీఆర్ బయటకు రావటం లేదని అన్నారు. ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ జరిగితే.. ఒక్కసారి కూడా ఆయన సభకు రాలేదని ఆక్షేపించారు. అధికారంలో ఉన్నప్పుడు కొడుకు, కూతురు, అల్లుడు గురించే పట్టించుకున్నడే తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కరించలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa