ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. హద్దులు దాటి కొందరు వికృతంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది యువత తమ చిల్లర చేష్టలతో సభ్య సమాజం ఛీ కొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దీపావళి వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఓ యువకుడు మహాత్ముడి నోట్లో టపాసులు పెట్టి పేల్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. దీంతో యువకులు తాము చేసిన తప్పును తెలుసుకొని క్షమించాలంటూ ఓ వీడియా రిలీజ్ చేశారు.
ఈ ఘటన మరిచిపోకముందే.. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్ముడికి అవమానం జరిగింది. ప్రగతినగర్లోని లేక్ వ్యూ కాలనీలో మంగళవారం (నవంబర్ 5) గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వసం చేశారు. విగ్రహం నుంచి జాతిపిత తలను వేరు చేసి పైశాచిక ఆనందం పొందారు. గాంధీజీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని విగ్రహాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని అన్నారు.
శంషాబాద్లో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం
మరో ఘటనలో నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని నవగ్రహ విగ్రహాల్లోని ఐదు విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం (నవంబర్ 5) స్వామివారి దర్శనానికి వెళ్లిన కొందరు భక్తులు విగ్రహాలు ధ్వంసం అయిన విషయాన్ని గమనించిన వెంటనే ఆలయ కమిటీకి తెలియజేశారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న బీజేపీతో సహా.. హిందూ సంఘాల నాయకులు గుడి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
బీజేపీ ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. హిందూ దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదని కొండా విమర్శించారు. ఇకనైనా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహ ధ్వంసంపై చర్యలు తీసుకుంటామని.. శంషాబాద్ డీసీపీ రాజేశ్ వెల్లడించారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టామన్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని.. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa