చిత్రపరిశ్రమ కేవలం ఐదారుగురు హీరోలదే కాదని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలు నిర్మించామని, టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ తన దగ్గరికి వచ్చే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబు పేల్చారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ఆరోసారి ఛైర్మన్గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్కి మంత్రి కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా ఆయన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను బాగా అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. అయితే.. ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు హీరోలు ఎదుగుతున్నారంటూ చెప్పుకొచ్చిన మంత్రి.. నిజమైన ప్రతిభ కలిగిన తెలంగాణ నటీనటులకు గుర్తింపు దక్కడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ అంటే ఐదారుగురు పెద్దలు, ఐదారుగురు హీరోలది మాత్రమే కాదని.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీలో చాలా మంది బయటి వ్యక్తులు ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో.. కొత్తగా నిర్మించే ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు ఆపేశామని.. వాటన్నింటిని తెలంగాణకు సంబంధించిన నటీనటులకే ఇచ్చేలా కృషి చేస్తామని కోమటిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ నుంచి మా భూమి, బలగం వరకు ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయని.. ఎంతో మంది ప్రతిభ కలిగిన దర్శక నిర్మాతలు ఉన్నారని తెలిపిన మంత్రి.. తప్పకుండా తమ ప్రభుత్వం తరపున అన్నివిధాల సహకారాన్ని అందిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు.. సినిమా థియేటర్స్ ఇప్పించమని తన దగ్గరకు వచ్చే ప్రతి చిన్న సినిమాకు తన వంతు సహకారం అందిస్తున్నట్టు కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. అలాగే.. చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ప్లాట్లలో తెలంగాణకు చెందిన నటీనటులుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa