ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండెపోటుతో గుడిలోనే ప్రాణాలొదిలిన 31ఏళ్ల వ్యక్తి.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 12:13 PM

ఆపదలు చుట్టుముట్టినప్పుడు ఆలయాలను సందర్శిస్తుంటారు. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తుంటారు. తమ కష్టాలను తొలగించమని భగవంతున్ని ప్రార్థిస్తారు.కోరిన కోర్కెలు తీరుస్తే మొక్కులు చెల్లించుకుంటామని ముడుపులు కడుతుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతున్నది. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు టెంపుల్ కి వెళ్లి ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేస్తున్నారు. ఈక్రమంలో ఓ యువకుడు ఆలయానికి వెళ్లాడు. తన ఇష్టదైవమైన ఆంజనేయస్వామిని దర్శించుకున్నాడు. ఆలయంలో ప్రదక్షిణలు చేశాడు. ఈ సమయంలోనే ఊహించని ఘటన ఎదురైంది. గుడికి వెళ్లిన భక్తుడు ప్రదక్షిణలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.అందరూ చూస్తుండగానే దేవుడి ముందే భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆలయ పూజారితో పాటు భక్తులంతా అయోమయానికి గురయ్యారు. చూస్తుండగానే ఆ యువకుడు హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్‌ 1లో అమ్మ హాస్టల్‌లో కానంపల్లి విష్ణువర్ధన్‌(31) ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. విష్ణువర్థన్ కు దేవుడంటే అపారమైన భక్తి. అతడు ప్రతిరోజు ఉదయం దేవాలయానికి వెళ్తుంటాడు. రోజు మాదిరిగానే సోమవారం(నవంబర్ 11) మార్నింగ్ కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్‌స్టాప్‌ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు.


గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ యువకుడు హార్ట్ ఎటాక్ కు గురయ్యాడు. అక్కడున్న భక్తులు వెంటనే స్పందించి సీపీఆర్‌ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. 31 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. యువకుడు కుప్పకూలుతున్న దృష్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా విష్ణువర్థన్ మృతి చెందిన విషయాన్ని ఆయన సోదరి హేమలతకి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఆతర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇటీవల గుండెపోటు మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేస్తున్నవారు సైతం గుండెపోటుకు గురవుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa