ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు జీ ఎమ్మెల్యేలకు నోటీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2024, 07:52 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా, పలువురు ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి నుంచి అక్రమంగా వందల కోట్లు డబ్బులు వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్.. పలువురు పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేయటంతో పాటు అరెస్టులు చేసింది. ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు.


అయితే మెుదటి సారిగా ఈ కేసులో ఓ మాజీ ఎమ్మెల్యేకు సోమవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీస్ ఉన్నతాధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్ట్స్ ఉండటంతో విచారణకు రావాలని జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నేడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో లింగయ్య విచారణకు హాజరు కానున్నారు.


ఇక ఇదే కేసులో మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. రేవంత్ ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తుండటం కలకలం రేపుతోంది. తర్వాత ఎవరికి నోటీసులు వస్తాయోనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ నెలకొంది.


కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌బీఐ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన అమెరికా వెళ్లిపోయారు. అప్పట్నుంటి ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. తాజాగా ఆయన అమెరికాలో గ్రీన్‌కార్డు పొందారు. దీంతో ఆయన ఇప్పట్లో తెలంగాణకు వచ్చే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రభాకర్ రావును విచారిస్తే కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు విషయాలు వెలుగులోకి రావని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తుండటం కలకలం రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa