నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ క్యాంపస్లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని స్వాతిప్రియ ప్రాణాలు కోల్పోయింది. స్వాతిప్రియ స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలిక పరిధిలోని పెర్కిట్ గ్రామం. ఉజ్వల-రవీందర్ దంపతులకు స్వాతిప్రియ(18) రెండో సంతానం. సోమవారం ఉదయం తోటి స్నేహితులు టిఫిన్ చేయడానికి పిలవగా ఆమె రానని చెప్పింది. ఆ తర్వాత అర గంటకు గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. గమనించిన తోటి విద్యార్థులు ఆర్జీయూకేటీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
అయితే స్వాతిప్రియ గదిలో సూసైడ్ లెటర్ దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆ లెటర్లోని కొన్ని పేజీలు బయటకు వచ్చాయి. మెుత్తం 6 పేజీల సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ అందులోని కొన్ని పేజీలను బయటకు లీక్ చేసినట్లు తెలిసింది. సూసైడ్ లెటర్లో తన కుటుంబం, విద్యార్థులు, కాలేజీ గురించి స్వాతిప్రియ ప్రస్తావించినట్లు వెల్లడైంది. సూసైడ్ లెటర్లో స్వాతిప్రియ ప్రస్తావించిన అంశాలు కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉందని.. అయినా తాను ఇక బతకలేనని చెప్పింది. తన అంత్యక్రియలకు స్నేహితులందరూ రావాలని కోరింది.
'అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ధైర్యం సరిపోవటం లేదు. అయినా తప్పట్లేదు.. ఐ మిస్ యూ సో మచ్. అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క, తమ్ముడు.. మీకేం కష్టం వచ్చినా డాడీకి చెప్పండి. నాన్న మీరు ఇకనైనా స్మోకింగ్ చేయటం మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి. మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియల్లో పాల్గొనాలి.' అంటూ స్వాతి ఆ సూసైడ్ లేఖలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. బాసర క్యాంపస్లో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. విద్యార్థిని స్వాతిప్రియ మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్య చేసి సూసైడ్గా చిత్రీకరించారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో మృతదేహాన్ని చూపించకుండానే మార్చురీకి తరలించటంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ యాజమాన్యం తీరు సరిగ్గా లేదని.. సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నట్లు స్వాతిప్రియ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కాలేజీ క్యాంపస్ను సందర్శించి వివరాలు సేకరించారు. బాసర క్యాంపస్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపాటుకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa