ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు, ఇక ఆ టెన్షన్ లేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 09:05 PM

తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలు ఎక్కవ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో బస్సులు కిక్కిరిపోతున్నాయి. బస్సుల్లో సీట్లు దొరకటం లేదు. దీనికి తోడు పాత బస్సులు నడుపుతుండటంతో అవి మెరాయించటంతోపాటుగా.. భారీ ఎత్తున వచ్చే పొగతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుంచి సీట్ల దొరకవన్న టెన్షన్, పాత బస్సుల్లో ప్రయాణించే వెతలు తీరనున్నాయి. హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఓఆర్‌ఆర్‌ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు.


సోమవారం నగరంలోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు నియామక పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడిన సీఎం.. కాలుష్యం లేకుండా నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. దీని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటుగా.. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయన్నారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.


రవాణా శాఖలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి సేవలు అందించడంలో ప్రజలతో గౌరవప్రదంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుతూ పది నెలల్లో 50 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసిన సందర్భం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిన సందర్భమన్నారు. ఇప్పుడు ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు గ్రామాల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు.


గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని.. గృహ ప్రవేశాల్లాంటి శుభ సందర్భాల్లో మత్తు పదార్థాలు తీసుకుని బుకాయించే సంస్కృతి రానీయొద్దన్నారు. 10 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామని.. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల 1.05 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇలాంటివెన్నో చేశామని సీఎం రేవంత్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa