ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టర్‌పై దాడి కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. సంచలన విషయాలు వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 11:08 PM

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ లగచర్ల ఘటనలో ఏ1గా.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఉన్నారని వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఇక కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి మొదట 47 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ మరో ఐదురురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో 21 మందిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనలో మరింత మంది నిందితుల కోసం 4 స్పెషల్ టీమ్స్ గాలింపు చేపట్టినట్లు వివరించారు.


ఇక లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందులో కీలక విషయాలను పోలీసులు చేర్చారు. ఇక ఈ కేసులో అధికారులను తప్పుదోవ పట్టించిన సురేష్‌పై గతంలో పలు కేసులు ఉన్నట్లు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఇక ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదని గుర్తించినట్లు చెప్పారు. ఇక కొంతమందికి భూమి ఉన్నా.. తాజాగా చేపట్టిన భూసేకరణ పరిధిలోకి రాదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఈ కేసులో పలువురు నిందితులు హైదరాబాద్‌ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని వెల్లడించారు. చాలామంది రైతులను విచారించి వదిలిపెట్టినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు.


ఇక లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నినట్లు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే ఈ దాడికి వ్యూహాలు రచించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేష్‌కు తరచూ ఫోన్‌ చేసినట్లు పట్నం నరేందర్‌ రెడ్డి అంగీకరించారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్‌ రెడ్డిని బుధవారం కొడంగల్‌ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa