ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవిత చేసిన పనికి నా అభినందనలు: మంత్రి పొంగులేటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 08:29 PM

తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈనెల 6న సర్వే ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3 శాతంతో తొలి స్థానంలో నిలవగా.. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ సర్వేపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిచేందుకు సర్వే నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. సర్వే భూటకమని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.


ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నట్లు తెలిసింది. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి సర్వే కోసం ఎన్యుమరేటర్లు వెళ్లగా.. కవిత, ఆమె భర్త కుటుంబ వివరాలు ఇచ్చి సర్వేలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ నేతలు వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం స్పందించారు.


రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయని ఫైరయ్యారు. సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు అందవంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ సర్వేతో ఏ ఒక్కరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. ప్రజలకు భరోసా కలిగించేలా సర్వేలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తన అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు కూడా తెలంగాణ ప్రజలేనని.. వారి కుటుంబాలను కూడా ఈ సమగ్ర సర్వేలో నమోదు చేసుకోవాలని సూచించారు.


బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే చేశామని గొప్పలు చెప్పుకున్నారని.. ఆ సర్వే ద్వారా తెలంగాణ ప్రజల కోసం మంచి చేసే కార్యక్రమాలు చేపట్టారా? అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను బదిలీ చేసుకోవడానికి, కొల్లగొట్టడానికే ఈ సర్వే ఉపయోగపడిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజలకు ఉపయోగపడేలా 2024 సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించామని.. సర్వే చేసిన ప్రతి దరఖాస్తునూ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా సర్వే కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు. దేశానికే రోల్‌మోడల్‌గా సమగ్ర కుటుంబ సర్వే నిలుస్తుందని పొంగులేటి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa