తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానికి వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహిస్తోంది. కేవలం సంబరాలతో మాత్రమే సరిపెట్టకుండా.. వరాల జల్లులు కూడా కురిపిస్తోంది సర్కారు. ఈ క్రమంలోనే.. ప్రజా విజయోత్సవ వేడుకల్లో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందే.. వరాల జల్లు కురిపించి.. ట్రై సిటీస్ ప్రజలకు శుభవార్త వినిపించింది ప్రభుత్వం.
వరంగల్... కాకతీయ కాలం నుంచి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన నగరమని.. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే.. ఇలాంటి నగరంపై దశాబ్దకాలంగా నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయని చెప్పుకొచ్చారు. చారిత్రక నగరాన్ని అభివృద్ధి బాటన నడిపించడానికి ప్రజా ప్రభుత్వం నడుం బిగించిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
2041 మాస్టర్ ప్లాన్తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచించినట్టు సర్కార్ పేర్కొంది. ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మహా నగరం అబివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది.
ఏ ఏ అభివృద్ధి పనులకు ఎన్నెన్ని నిధులు (కోట్లలో)..
వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ : రూ.4,170 కోట్లు
మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణ: రూ. 205 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ : 160.92 కోట్లు
టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలు ..రూ.33.60 కోట్లు
టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు.. రూ. 43.15 కోట్లు
కాళోజీ కళాక్షేత్రం రూ.85 కోట్లు
పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ : రూ. 65 కోట్లు
నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం: రూ.8.3 కోట్లు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ రూ. 32.50 కోట్లు
ఇన్నర్ రింగ్ రోడ్: రూ.80 కోట్లు
భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ : రూ.28 కోట్లు
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు : రూ. 49.50
వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : 1.50 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa