ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి చేరికలు.. కీలక నేత జాయినింగ్.. ఆయనకే అధ్యక్ష పదవి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 07:38 PM

తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటమే చూశాం. ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా హస్తం కండువాను కప్పుకున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా పరిస్థితి కొంచెం మారినట్టుగా కనిపిస్తోంది. ఈమధ్య అధికార కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలోకి కూడా చేరికలు జరుగుతున్నాయి. ఇక్కడి వరకు ఓకే కానీ.. ప్రస్తుతం ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది.


ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదట తెలుగుదేశంతోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తీగల కృష్ణారెడ్డి.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామావతో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాగా.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినా.. అక్కడ బెర్తులు మొత్తం హౌస్ ఫుల్ అవటంతో.. మళ్లీ టీడీపీకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్థం కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన అధికారికంగా తీగల కృష్ణారెడ్డి పార్టీ మారనున్నట్టుగా తెలుస్తోంది.


అయితే.. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణలో పూర్తిగా అడుగంటిపోయిన తెలుగుదేశం పార్టీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే.. మొన్నటివరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్.. బీఆర్ఎస్ కండువా కప్పుకోవటంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో.. తెలంగాణలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా అయిపోయింది.


ఈ క్రమంలో.. తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే.. అధ్యక్షుడిగా మంచి నాయకుడిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తీగల కృష్ణారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి ఆ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచగా.. టీకేఆర్‌ కూడా ఒప్పుకున్నారని సమాచారం. దీంతో.. తీగల కృష్ణారెడ్డి టీటీడీపీలో చేరటం, అధ్యక్ష పదవి చేపట్టటం ఖరారైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందన్నది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఆగాలి.. లేదా ఎవరైనా అధికారికంగా ప్రకటించాలి.


అయితే.. గతంలోనూ ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన బాబును.. మాజీ తెలుగు తమ్ముళ్లు వెళ్లి కలవగా.. వాళ్లంతా మళ్లీ టీటీడీపీలో చేరతారని వార్తలు గుప్పుమన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీటీడీపీలో చేరనున్నారని.. ఆయనకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టనున్నారంటూ కూడా చాలానే వార్తలు వచ్చాయి. ఒకానోక సమయంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కూడా తెలంగాణ పార్టీ బాధ్యతలు కట్టబెడతారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ.. ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ మాత్రం చేపట్టలేదు. దీంతో.. ఇప్పుడొస్తున్న వార్తలను కూడా ప్రజలు అంతగా నమ్మట్లేదు. చూడాలి మరి.. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో..?







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa